IFS ranker Raju: ఐఎఫ్ఎస్ ర్యాంక‌ర్ రాజు మంత్రుల ప్రశంసలు.. స‌న్మానించిన త‌ల‌సాని, మ‌హ‌మూద్ అలీ..

కాస‌ర్ల రాజును మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌మూద్ అలీ సత్కరించారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో అర‌ణ్య భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన‌ అభినందన సమావేశంలో..

IFS ranker Raju: ఐఎఫ్ఎస్ ర్యాంక‌ర్ రాజు మంత్రుల ప్రశంసలు.. స‌న్మానించిన  త‌ల‌సాని, మ‌హ‌మూద్ అలీ..
Ifs Ranker Raju

తొలి ప్ర‌య‌త్నంలోనే ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ (IFS)లో ఆలిండియా 86వ ర్యాంకు సాధించిన కాస‌ర్ల రాజును మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌మూద్ అలీ సత్కరించారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో అర‌ణ్య భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన‌ అభినందన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఎఫ్‌సీఆర్ఐ త‌ర‌పున ల‌క్ష రూపాయాల ప్రోత్స‌హ‌కాన్ని రాజుకు అంద‌జేశారు. రాజుతో కాసేపు ముచ్చటించిన మంత్రులు.. పరీక్షలో విజయం సాధించినందుకు ఆయ‌నను అభినందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. అడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో పాటు జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను నెలకొల్పార‌ని అన్నారు. FCRI స్థాపించిన అన‌తి కాలంలోనే కాస‌ర్ల రాజు వంటి వారు తొలి ప్ర‌య‌త్నంలోనే ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ సాధించ‌డం అట‌వీ క‌ళాశాల‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు.

జనగామ జిల్లా సూరారం గ్రామంలోని ఓ సాధ‌ర‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన రాజు ఎంతో క‌ష్ట‌ప‌డి ఐఎఫ్‌ఎస్ సాధించి.. పేద‌రికం ప్ర‌తిభ‌కు అడ్డంకి కాద‌ని నిరూపించి.. అంద‌రికి ఆద‌ర్శంగా నిలిచారని ప్రశంసించారు. రాజును స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో మరింత రాణించాలన్నారు.

జాతీయ స్థాయి పోటీ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించేందుకు వీలుగా విద్యార్థుల‌కు ఉన్న‌త‌మైన విద్యా బోధ‌న‌ను అందించేందుకు కృషి చేస్తున్న అట‌వీ శాఖ ఉన్న‌తాధికారులు, FCRI డీన్ ప్రియాంక వర్గీస్, అధ్యాపకులు, సిబ్బందిని ప్ర‌త్యేకంగా అభినందించారు.

ఐఎఫ్ఎస్ ర్యాంక‌ర్ రాజు మాట్లాడుతూ.. త‌న‌కు త‌న పేరెంట్స్ ఎంతో స‌పోర్ట్ ఇచ్చార‌ని, FCRI నుంచి మంచి గైడెన్స్ ల‌భించింద‌న్నారు. త‌న జ‌ర్నీలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ క్రెడిట్ ద‌క్కుతుంద‌ని, వారంద‌రికీ రాజు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో అట‌వీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అద‌న‌పు పీసీసీఎఫ్ ఎంసీ ప‌ర్గెయిన్, FCRI డీన్ ప్రియాంక వర్గీస్, డిప్యూటీ డైరెక్టర్ కె. శ్రీనివాస్, డిసిఎఫ్ ఎ.నరసింహ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తెలంగాణ వార్తలు